బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనతో కిషన్ రెడ్డి భేటీ

by Disha Web Desk |
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనతో కిషన్ రెడ్డి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. భారత పర్యటనలో ఉన్న షేక్ హసీనతో కిషన్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఇరుదేశాల్లో వివిధ అంశాల్లో సానుకూల ఫలితాలకు ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

రెండు దేశాల మధ్య రోడ్డు, విమాన, రైలు, జలరవాణా(మల్టీ-మోడల్ కనెక్టివిటీ) మార్గాల అభివృద్ధి వేగవంతంగా జరగడంలో చొరవతీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బార్డర్ హాట్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందనే అంశాన్ని షేక్ హసీనా దృష్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకెళ్లారు. విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు.

అనంతరం షేక్ హసీన సమక్షంలో ఇరుదేశాల పారిశ్రామిక వేత్తల సదస్సు(సీఈవో కాన్ఫరెన్స్)ను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈశాన్య భారతం అభివృద్ధి కోసం ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల మధ్య అనుసంధానత తదితర అంశాలకు పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. టూరిజం, వైద్య పర్యాటకం, విద్య, సాంస్కృతిక మార్పిడి తదితర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి వెల్లడించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

రష్యాతో ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.. మోడీ



Next Story

Most Viewed